అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, October 26, 2014

విద్యార్థుల నుండి 'పిండేసుకోవడమేనా' 'కోచింగ్' అంటే..!!

ఆరు వేల మంది విద్యార్థులు క్యూలో నిలబడితే.. ఒక ఇనిస్టిట్యూట్ లో కోచింగ్ సీటు కోసం లాఠీచార్జీ కూడా జరిగితే.. ఆ ఇన్సిస్టిట్యూట్ ఎంత గొప్ప డిమాండ్ ఉన్నట్లు ఎవ్వరైనా ఒప్పుకుంటారు. ఇంతమంది విద్యార్థుల అరుపులు, సందడితో ఎంత పెద్ద ప్రాంతమైనా మారు మోగాల్సిందే.. అదీ నిత్యం విద్యార్థులతో రద్ధీగా ఉండే హైదరాబాద్ లోనైతే ఒక ఇనిస్టిట్యూట్ కు ఇంతకంటే ఇంకా పెద్ద పబ్లిసిటీ... అడ్వర్టైజ్ మెంట్ ఏం కావాలి.??
ఇక అది రాష్ట్రంలోనే పేరుమోసిన ఓ ఇనిస్టిట్యూట్. ఆ సంస్థకు మాం...చి గుడ్ విల్ ఉంది. ఇంకేముందీ గుడ్ విల్ కు మార్కెటింగ్ స్ట్రాటజీ జోడించారు. లేని డిమాండ్ ను 'సృష్టించారు.' స్టూడెంట్స్ ను ఇబ్బంది పెట్టి మరీ సందర్భాన్ని భా...గా 'క్యాష్' చేసుకుంది. ఆ ఇన్సిట్యూట్ సీటే వర్నమెంట్ జాబ్  అన్నంత హైప్ క్రియేట్ చేశారు. అద్భుత ఫలితాన్ని పొందారు. తీరా విద్యార్థులకు సరైన సమయంలో మాత్రం కోచింగ్ ప్రారంభించనే లేదు. 

వీడు ఇంత సాగదీస్తున్నాడు.. ఏం జరిగిందబ్బా అనుకుంటున్నారా...? ఇక చదవండి..

హైదరాబాద్ లో అశోక్ నగర్...
                    ఇనిస్టిట్యూట్ లకు ఫేమస్. ఈ ప్రాంతంలో కుప్పలుతెప్పలుగా ఇనిస్టిట్యూట్లు కేంద్రీకృతమై ఉంటాయి. ఇరు రాష్ట్రాలనుండి ఎక్కడెక్కడి నుండో వచ్చి.. విద్యార్థులు రూంలు, హాస్టళ్లలో ఉంటూ ప్రభుత్వ కొలువులు సాధించేందకు ఇక్కడే అష్టకష్టాలు పడుతుంటారు. ఈ మధ్య కొత్త రాష్ట్రం ఏర్పడటంతో గవర్నమెంటు ఉద్యోగాలు పడతాయన్న ఆశతో చాలా మంది మారుమూల గ్రామాలనుంచి విద్యార్థులు ఇనిస్టిట్యూట్ కోసం ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈ డిమాండ్ ను ముందే పసిగట్టింది 'టాప్' ఇన్సిట్యూట్ లలో ఒకటైన ఆర్సీరెడ్డి. ఈ సందర్భాన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని బ్యాచ్ లు స్టార్ట్ చేస్తామని ఒక రెండు మూడు నెలల పాటు విద్యార్థుల పేర్లు రిజిస్టర్ చేసుకుంది. కాగా చాలా మంది పేర్లు రిజిస్టర్ చేసుకున్నా.. బ్యాచ్ స్టార్ట్ చేయకపోవడంతో ఓ సారి ఓయూ విద్యార్థులు ఇక్కడ ధర్నా చేసి వెళ్లారు కూడా... తీరా ఆరువేల పైచిలుకు మంది విద్యార్థులు తాము కోచింగ్ తీసుకుంటామని తమ పేరు రిజిస్టర్ చేసుకున్నారు.
''ఒక రోజే అడ్మిషన్స్ త్వరపడండీ''.. ఆరువేల మందికీ 'ఒకే మెసేజీ'.. 
''ఈ ఒక్క రోజులోనే వచ్చి జాయిన్ కావాలి... ఈ రోజు వచ్చిన వారికే సీటు ఉంటుంది. ఒక్క బ్యాచ్చే స్టార్ట్ చేస్తున్నాము. ముందు వచ్చి ఫీజు చెల్లించిన వారికే మొదటి ప్రాధాన్యం..'' అని కరెక్టుగా దసరాకు నాలుగైదు రోజుల ముందు అందరికీ ఆర్సీ రెడ్డి నుండి ఒకే మెసేజీ వెళ్లింది. పాపం... ఈ సారి ఎలాగైనా కోచింగ్ తీసుకుని జాబ్ కొట్టాలని ఎదురు చూస్తున్న ఆరువేల మందీ వచ్చేసారు. ఈ ఇంకా తమ పేరు రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు కూడా చాలా మంది వచ్చారు. ఉదయం ఐదు గంటల నుండి క్యూ కట్టారు. ఆర్సీరెడ్డి ఇన్సిట్యూట్ నుండి అశోక్ నగర్ రోడ్ వరకూ చాంతాడంత క్యూ ఏర్పడింది. ఇంకా విద్యార్థుల తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, బంధువులతో అశోక్ నగర్ మొత్తం సందడి సందడిగా మారింది.
పోలీసులతో హంగామా...
ఇంత మంది విద్యార్థులు క్యూలో నిల్చోవడంతో.. రిజిస్ట్రేషన్ లో చేయడంలో కొంచెం ఆలస్యమైనా.. లేదా ఎవరైనా క్యూలో తమకంటే ముందు వచ్చి మధ్యలో నిల్చున్నా... థియేటర్లలో టిక్కెట్ల వద్ద అరిచినట్లు విద్యార్థులు పెద్ద ఎత్తున అరుస్తున్నారు. గొడవచేస్తున్నారు. ఎంతైనా ఉడుకు రక్తం కదా.. దీంతో కొంత గందరగోళం నెలకొంది. వెంటనే 20 మంది పోలీసులు రంగంలోకి దిగారు. ఇక అక్కడ హైడ్రామా స్టార్ట్ అయ్యింది. అదేదో ముఖ్యమంత్రి ఆఫీసు అయినట్లు ఒక్కరిని కూడా కనీసం ఆఫీసు ముందు నిల్చోనివ్వ లేదు. అంతెందుకు ఆ గల్లీలోకి వెళ్లనివ్వలేదు. క్యూలో ఉన్న విద్యార్థులంతా అష్టకష్టాలు పడి ఐదారుగంటలు నిల్చుని ఆపసోపాలు పడ్డారు. కాగా మొత్తం ఫీజు ఒకేసారి 16,950 రూ.లు చెల్లించి.. ఒక రిసిప్ట్ తీసుకుని బయటకి వస్తూ.. తామేదో సాధించామని ఫీలవుతున్నారు. ఉదయం ఆరుగంటలనుండి మొదలైన రిజిస్ట్రేషన్.. రాత్రి ఏడెనిమిది గంటల వరకు కొనసాగింది. మూడు బ్యాచ్ లకు 4,500 నుంచి 5,000 మందిని జాయిన్ చేసుకుని, వారినుంచి నుంచి ఫీజు  వసూలు చేశారు. మూడు బ్యాచ్ లు కాబట్టి.. ఒక్కో బ్యాచ్ లో సుమారు 1500 వందలకు  పైగా మందితో నడుస్తుందన్నమాట.
సృష్టించ బడిన డిమాండ్..
అయితే ఇదంతా 'సృష్టించబడిన డిమాండ్' అని ఎవ్వరూ గ్రహించనేలేదు. సాధారణంగా ఎప్పటి వప్పుడు లేదా ఒక వారం రెండు వారాలు జాయినింగ్ ప్రాసస్ ఉంటే..  కొంత మంది ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులు పీజు కొంత తక్కువ చేయమని కోరతారు.  కానీ ఈ కల్పిత డిమాండ్ తో దేవుడా.. ఆ ఆఫీసులోకి వెళ్లడమే గొప్పరా బాబు అనుకుంటూ.. యాజమాన్యం  చెప్పినంత ఫీజు చేతిలో పెట్టి వచ్చారు.
ఇప్పటికీ ఒక్క బ్యాచ్చే ప్రారంభం...
అయితే విశేషమేమిటంటే సెప్టెంబర్ 29న జాయినింగ్ ప్రాసెస్ జరిగింది. మొదటి బ్యాచ్ అక్టోబర్ 23న ఒక ప్రారంభమైంది. మరో బ్యాచ్ అక్టోబర్ నెల 27న ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. కాగా మూడో బ్యాచ్ నవంబర్ మొదటి వారంలో మొదలవుతుందంటున్నారు. ముక్కుపిండి డబ్బులు వసూలు చేసిన ఆర్సీ రెడ్డి యాజమాన్యం బ్యాచ్ లు ప్రారంభించడంలో మాత్రం తాత్సారం చేస్తున్నారు. దీంతో త్వరగా కోచింగ్ కంప్లీట్ చేసుకుని ఈ సారి ఎలాగైనా జాబ్ కొట్టాలని  ఫీజులు ముందే చెల్లించిన విద్యార్థులు ఆందోళనకు గురౌతున్నారు. మార్కెటింగ్ స్ట్రాటజీ భాగానే ప్లాన్ చేశారు. దాంతో పాటు విద్యార్థులకు సరైన సదుపాయాల్తో.. సరైన సమయంలో శిక్షణ అందిస్తే బాగుండేది.. ఏం చేస్తాం.. కార్పో'రేట్' లకు విద్యార్థుల కష్టాలేం పడతాయి.!!
కోచింగ్ ఎలా ఉంటుంది..
వారి ఒక్క ఈ మూడు బ్యాచ్ లు ప్రారంభించినందుకు ఆదాయం సుమారు ఎనిమిది కోట్ల యాబై లక్షలు(17000X5000 = 8,50,00,000) వీరు  ఒక ఫంక్షన్ హాల్.. లేదా ఒక కాలేజీలో పేద్ద మీటింగ్ హాల్ అద్దెకు తీసుకుంటారు. ఈ 1500 వందల మందిని గుంపుగా కూర్చోబెట్టి మైక్ లో పాఠం చెబుతారు. చివరిలో ఉన్న వారికి బోర్డు కనిపించదు.  పాఠం చెప్పే మనిషి  వాయిస్ వినిపించడం తప్ప.. కనిపిస్తే గొప్ప విషయం. ఇంత మంది విద్యార్థుల్లో ఎవరు ఏమి నేర్చుకుంటారు..?? డౌట్స్ వస్తే ఇంత మంది తమ సందేహాలను ఎలా తీర్చు కుంటారు..??? డబ్బులు తప్ప వీరికి నాణ్యత పట్టదా..??? ఒక్కొక్కరి వద్ద ఇన్నిన్ని ఫీజులు వసూలు చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పెద్ద ఇనిస్టిట్యూట్స్ అని చెప్పుకునే ఇలాంటి సంస్థలకు నియంత్రణ ఉండదా..?? నిరుద్యోగ యువతను నిలువు దోపిడీ చేస్తున్న ఇలాంటి సంస్థకు అడ్డుకట్ట పడదా.?? అమాయక విద్యార్థులు బలి కావాల్సిందేనా..??


సుందర్

No comments:

Post a Comment